KCR News Latest | పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం అని పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కేసీఆర్. ఉప ఎన్నికల సన్నద్ధతను ఇప్పటినుంచే ప్రారంభించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా గట్టిగా కృషి చేయాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఎండగట్టాలని కేసీఆర్ పార్టీ నాయకులకు సూచించారు.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభలో డజన్ మంది ఎంపీలు ఉంటే బనకచర్ల అంశంపై గట్టిగా కొట్లాడేవారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు. బనకచర్లపై రాజకీయ, న్యాయపరమైన పోరాటానికి సన్నద్ధం కావాలన్నారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా పార్టీ కేడర్ను సన్నద్ధం చేయాలన్నారు. ఆగస్ట్ 8న కరీంనగర్ సభ తర్వాత రాష్ట్రపతిని పార్టీ ప్రతినిధి బృందం కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం విజ్ఞప్తి చేయనున్నట్లు కేసీఆర్ వ్యాఖ్యానించారు.









