Judge Steps Out of Courtroom | నిజామాబాద్ జిల్లా బోధన్ కోర్టు ప్రాంగణంలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. వృద్ధ దంపతుల దీన స్థితిని అర్ధం చేసుకున్న జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయి శివ కేసులోని నిందితుల వద్దకే వచ్చి తీర్పిచ్చారు.
సంప్రదాయానికి భిన్నంగా జడ్జి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు సాయమ్మ మరియు గంగారామ్లపై వారి కోడలు వరకట్న వేధింపుల కేసు దాఖలు చేసింది.
ఈ క్రమంలో కోర్టుకు హాజరయ్యేందుకు దంపతులు ఆటోలో వచ్చారు. అయితే అనారోగ్యం, నడవలేని స్థితి కారణంగా వారు కోర్టులోకి వెళ్లేందుకు ఇబ్బందుకు ఎదురుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జడ్జి సాయి శివ తన బెంచ్ ను వదిలి నిందితుల వద్దకు వచ్చారు. న్యాయమూర్తే తమ వద్దకు రావడంతో వృద్ధ దంపతులు ఆశ్చర్య పోయారు.
అనంతరం కేసుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో వృద్ధ దంపతుల తప్పేమీ లేదని తెలుసుకున్న న్యాయమూర్తి కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో తమ పరిస్థితిని అర్ధం చేసుకుని కోర్టు నుండి బయటకు వచ్చి తీర్పిచ్చిన జడ్జికి దంపతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. మానవత్వం చాటుకున్న జడ్జి పై అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.