Janasena Jayakethanam Sabha | జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు ఆ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ను భారీ మెజారిటీతో తొలిసారి అసెంబ్లీకి పంపించిన పిఠాపురంలోనే ఆవిర్భావ సభ జరగనుంది.
2014 మార్చి 14న హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ పుట్టింది. సుమారు పదేళ్ల పాటు ఉద్యమాలు, ఆందోళనలతో జనసేన నిత్యం ప్రజల మధ్యలో ఉంది. 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడిన పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు దక్కాయి.
100 శాతం స్ట్రైక్ రేట్ ను సొంతం చేసుకుని జనసేన చరిత్ర సృష్టించింది. ఈ ఘన విజయాల నేపథ్యంలో జయ కేతనం పేరుతో సభను నిర్వహిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద ఈ సభ జరగనుంది.
న భూతో అనేలా జయకేతనం ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నట్లు పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సభా స్థలంలో 12 అంబులెన్సులు, మెడికల్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
అలాగే మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభం కానుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) ఏం చెప్పబోతున్నారో అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.