Indian Flag At Karachi Stadium | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ( ICC Champions Trophy ) బుధవారం నుండి మొదలవనుంది. అయితే భారత్ పాకిస్తాన్ వెళ్ళేది లేదని తేల్చి చెప్పడంతో హైబ్రిడ్ ( Hybrid ) పద్ధతిలో టీం ఇండియా తన మ్యాచులను దుబాయ్ వేదికగా ఆడనుంది.
ఈ క్రమంలో పాకిస్తాన్ ఇటీవల చేసిన ఓ పని తీవ్ర వివాదానికి దారి తీసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే దేశాల జాతీయ జెండాలను కరాచీ స్టేడియంలో ప్రదర్శించారు.
అయితే ఇందులో భారత్ జెండా లేకపోవడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. భారత్ తన మ్యాచులను దుబాయ్ లో ఆడుతుందని అందుకే ఆ దేశ జెండాను ప్రదర్శించలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ) అధికారులు వెల్లడించారు.
బంగ్లాదేశ్ కూడా తొలి మ్యాచ్ భారత్ తో ఆడుతుంది, దింతో ఆ దేశ టీం కూడా పాకిస్తాన్ కు ఇంకా రాలేదు..ఈ నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ ల జాతీయ జెండాలను ప్రదర్శించలేదని పీసీబీ ( PCB ) వర్గాలు చెప్పాయి. కానీ ఈ ఘటన పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.
వస్తున్న విమర్శల నేపథ్యంలో పీసీబీ దిగొచ్చింది. భారత జెండాను కరాచీ స్టేడియంలో ప్రదర్శించింది. దింతో ఈ వివాదానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముగింపు పలికినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీం ఇండియా గురువారం బంగ్లాదేశ్ తో తలపడనుంది. అలాగే ఫిబ్రవరి 23న పాకిస్తాన్ తో దుబాయ్ వేదికగా తలపడనుంది.