Indian Community Awareness Meet in Dallas | అమెరికాలో ఇటీవల భారతీయుల పట్ల గతంలో ఉండే గౌరవం క్రమంగా తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇతర దేశాల నుంచి అమెరికాలో స్థిర పడిన వారిపట్ల ద్వేషం పెరుగుతుంది.
ఇదే సమయంలో అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు అందులోనూ మరీ ముఖ్యంగా ప్రవాస తెలుగువారు చేస్తున్న కొన్ని పనులూ కూడా గౌరవ భంగానికి కారణం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొందరు. తాజగా డల్లాస్ లో తోటకూర ప్రసాద్ ఆధ్వర్యంలో ‘ప్రవాస భారతీయ అవగాహన సదస్సు’ జరిగింది. ఇందులో పాల్గొన్న వక్తలు కీలక సూచనలు చేశారు. పండుగల సమయాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వీధుల్లో, రోడ్లపై బాణాసంచా కాల్చడం, ఉత్సవాలు జరుపుకోవడం, డీజేలు వినియోగించి పాటలు పెట్టుకుని డాన్సులు చేయడం వంటి పనుల మూలంగా అమెరికన్లు భారతీయుల పట్ల చిన్నచూపు చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
స్వదేశం నుంచి ఎవరైనా రాజకీయ నాయకుడు లేదా సినిమా సెలబ్రెటీ వస్తే కార్లలో ర్యాలీలు, హోటల్ ముందు భారీగా జనం పొగయ్యి నినాదాలు చెయ్యడం వంటివి చేయొద్దని సూచనలు చేశారు. అలాగే అభిమాన హీరోల సినిమాల విడుదల సమయాల్లో థియేటర్ కు వెళ్లి మూవీ చూసి రావడం బదులు పాలాభిషేకాలు, నినాదాలు, ఈలలు, గోల చేయడం మూలంగా స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి పనులు అమెరికన్లకు చిరాకు తెప్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో యువతను తల్లిదండ్రులు, పెద్దలు మార్గదర్శం చేయాలని కోరారు.










