India Pak Match In ICC World Cup | ఈ ఏడాది జరగనున్న ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీ (ICC Women’s World Cup)కి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమవుతుంది.
భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, సౌతాఫ్రికా, పాకిస్తాన్ మొత్తం ఎనిమిది జట్లు ఈ వరల్డ్ కప్లో పాల్గొంటున్నాయి. భారత్, శ్రీలంకలోని ఐదు సిటీలు ఈ మ్యాచ్లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత్ వేదికగా బెంగళూరు, వైజాగ్, ఇండోర్, గువాహటి.. శ్రీలంకలోని కొలంబోలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టోర్నీలో భారత్ పాక్ తలపడాల్సి ఉంది.
ఇరు దేశాల మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ మ్యాచ్ పై సందిగ్ధత నెలకొంది. అయితే తాజాగా ఐసీసీ ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరిగే వేదిక, తేదీని ప్రకటించింది. అక్టోబర్ 5న శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్ పాక్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
కాగా, బీసీసీఐ, పీసీబీ మధ్య హైబ్రిడ్ హోస్టింగ్ ఒప్పందంలో భాగంగా పాక్ తన అన్ని మ్యాచ్లను కొలంబోలో ఆడుతుంది. ఒకవేళ మొదటి సెమీ ఫైనల్స్ మ్యాచ్కి పాకిస్తాన్ అర్హత సాధిస్తే కొలంబోలో, లేకపోతే గువాహటిలో మ్యాచ్ జరగనుంది. అదే విధంగా పాకిస్తాన్ ఫైనల్స్ కు చేరితే ఆ మ్యాచ్ కొలంబోలో.. లేదంటే బెంగళూరులో మ్యాచ్ జరగనుంది.