IMF giving International Militant Fund to Pakistan | పాకిస్థాన్ ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర సంక్షోభం వైపు వెళ్తోంది. ఇదే సమయంలో భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
ఈ తరుణంలో పాక్ తమల్ని ఆదుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద మొరపెట్టుకుంది. పాకిస్థాన్ కు లోన్ ఇవ్వొద్దని, ఒకవేళ లోన్ ఇస్తే ఆ డబ్బుల్ని పాకిస్థాన్ ఉగ్రవాదులకు దోహదపడే విధంగా నిధుల్ని దారి మళ్లించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ కు బెయిల్ ఔట్ ప్యాకేజీపై చర్చించేందుకు ఐఎంఎఫ్ శుక్రవారం సమావేశం అయ్యింది.
అనంతరం తక్షణమే పాకిస్థాన్ కు బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే ఓటింగ్ భారత్ దూరంగా ఉంది. మరోవైపు ఐఎంఎఫ్ రుణం ఆమోదించిన విషయాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షెరీఫ్ కార్యాలయం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పాకిస్థాన్కు 1 బిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించిన నిర్ణయంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ రుణం పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థలకు సహాయం చేసే విధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇది చాలా దురదృష్టకరం, ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి కాదు, అంతర్జాతీయ ఉగ్రవాద నిధి అంటూ నిప్పులుచెరిగారు. వారు పాకిస్థాన్కు ఇస్తున్నది ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే రుణమని దుయ్యబట్టారు.
అమెరికా, కెనడా, జర్మనీ వంటి దేశాలు ఈ నిర్ణయానికి మద్దతు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. ఉద్రిక్తతలు తగ్గించాలని అంటున్నారు, ఇదే సమయంలో ఆయుధాలు సమకూర్చుకునేందుకు పాకిస్థాన్ కు బిలియన్ డాలర్ల రుణం ఇచ్చారని ఒవైసీ ఫైర్ అయ్యారు.










