Hussain Sagar boat fire accident | భారతమాత మహా హారతి ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టడం లేదని ప్రశ్నించారు బీఆరెస్ నేత ఆరెస్ ప్రవీణ్ కుమార్.
అల్లు అర్జున్ కు ఒక న్యాయం..కిషన్ రెడ్డికి మరో న్యాయమా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. సంధ్య థియేటర్ ఘటనకు ఒకలా , హుస్సేన్ సాగర్ ఘటనకు మరోలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు స్పందిస్తున్నదని ధ్వజమెత్తారు.
బీసీ బిడ్డలు గణపతి,అజయ్ ల ప్రాణాలు… రేవతి ప్రాణాల విలువ ఒకటి కాదా? రేవంత్ రెడ్డికి బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్య అనుబంధం ఏంటి? అని ప్రశ్నించారు.
సంధ్య థియేటర్ కేసులో మహిళ చనిపోతే అల్లు అర్జున్ ని జైలుకు పంపారని, కానీ భారతమాత మహా హారతి ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోతే కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టడం లేదన్నారు.
భారతమాత మహా హారతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి దీనికి బాధ్యులు కారా? అని ఆరెస్ ప్రవీణ్ కుమార్ నిప్పులుచేరిగారు.
‘కిషన్ రెడ్డి స్పూర్తితో నడుస్తున్న భారతమాత ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి పోలీసు పర్మిషన్ తీసుకున్నదా? తీసుకుంటే ఒక చెరువు మధ్యలో టపాకాయలు కాలుస్తామని చెప్పిండ్రా? ఇంతవరకు ఒక్క నిందితుడిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఘోర ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరే కదా హోంమంత్రి. అగ్నిమాపక శాఖ కూడా మీ దగ్గరే ఉంది కదా?’ అని ఈ బీఆరెస్ నేత ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.