Grandmother takes NEET at 72 in Kakinada | ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం చేపట్టిన నీట్ యూజీ 2025 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
దేశవ్యాప్తంగా 22.7 లక్షల మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాసేందుకు అప్లై చేశారు. ఇందులో 20.8 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. చదువుపై మక్కువతో వయస్సుతో సంబంధం లేకుండా ఎందరో నీట్ పరీక్షను రాశారు. ఇందులో 72 ఏళ్ల బామ్మ కూడా పరీక్ష రాయడం విశేషం.
అలాగే తెలంగాణకు చెందిన తల్లీకూతురు ఒకేసారి పరీక్షను రాశారు. కాకినాడకు చెందిన పోతుల వెంకట లక్ష్మి నగరంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాశారు. 72 ఏళ్ల బామ్మ ఉత్సాహం చూసి అక్కడున్న వాళ్లు ఆశ్చర్యపోయారు. చదువుకు వయసు అడ్డంకి కాదని వెంకట లక్ష్మి నిరూపించారు.
72 ఏళ్ల వయస్సులో కూడా ఎంతో ఓపికగా పరీక్షకు హాజరై, రాసిన బామ్మ అందరి హృదయాలను గెలుచుకుంది. ఇకపోతే తెలంగాణలో కూడా నీట్ పరీక్షను ఓ విద్యార్థినితో పాటు ఆమె తల్లి కూడా హాజరయ్యారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మంచ్యానాయక్ తండాకు చెందిన భూక్యా సరిత ఆర్ఎంపీగా పనిచేస్తున్నారు.
సరిత 2007లో బీఎస్సీ నర్సింగ్ ఫైనలియర్లో ఉండగా వివాహమైంది.. దీంతో ఆమె పరీక్షలు రాయలేకపోయారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. భర్త భూక్యా కిషన్ కూడా ఆర్ఎంపీ. ఈ దంపతులు తమ కుమార్తెను ఎంబీబీఎస్ చదవించి డాక్టర్ చేయాలని ఆశతో ఉన్నారు.
వీరి కుమార్తె ఖమ్మంలో నీట్ కోచింగ్ తీసుకుంటున్న సమయంలో తల్లి సరితకు కూడా నీట్ రాయాలనిపించింది. వెంటనే ఆమె కూడా పరీక్ష కోసం ప్రిపేరయ్యారు. ఈ క్రమంలో తల్లి సరిత సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో పరీక్ష రాయగా, కుమార్తె కావేరి, ఖమ్మంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎన్ఎస్పీ క్యాంపు సెంటర్లో పరీక్ష రాశారు.










