-బాపట్ల మండలం భర్తీపూడిలో విగ్రహం కూల్చివేత
-తీవ్రంగా ఖండిస్తున్నామంటూ లోకేశ్ ట్వీట్

వైసీపీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఓటమి భయంతోనే దుర్మార్గాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. బాపట్ల మండలం భర్తీపూడిలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ స్థానాన్ని ఎవరూ తొలగించలేరని చెప్పారు. ఆయన విగ్రహాలను కూల్చివేయడం దుర్మార్గమని ఆరోపించారు. విగ్రహాల కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నామని, 3 నెలల్లో కూల్చిన వారితోనే, కూల్చిన చోటే మళ్లీ పెట్టిస్తామని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
బాపట్ల మండలం భర్తీపూడిలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓటమి భయంతో వైకాపా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది. తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్ స్థానాన్ని వైకాపా ఆయన విగ్రహాల కూల్చివేతతో చెరిపేయలేదు. 3 నెలల్లో కూల్చిన వారితోనే ఎన్టీఆర్ విగ్రహం కూల్చిన చోటే మళ్లీ పెట్టిస్తాం.
జై తెలుగుదేశం.. జోహార్ ఎన్టీఆర్..