Deputy Cm Pawan Kalyan News | మహిళలను కించపరచే నోటివదరు వైసీపీని వదల్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలిపారు.
మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తారు. ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన మాటలకి సభ్య సమాజం సిగ్గుపడుతుందన్నారు.
వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం, మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలని కోరారు. మహిళల గౌరవానికి భంగం కలిగించినా, అసభ్య వ్యాఖ్యలు చేసినా చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు.
అధికారంలో ఉన్నప్పుడూ ఆ పార్టీ నాయకులు నోటి వదరుతో అసభ్యంగా వ్యాఖ్యలు చేశారని, నిండు శాసనసభలో కూడా అదే విధంగా మాట్లాడటంతో… ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పారని విమర్శించారు.
అయినప్పటికీ వదరుబోతు మాటలు వదల్లేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెబుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.










