Deputy Cm Pawa Kalyan News | ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా, కృత్తివెన్ను మండలం, చందాల గ్రామానికి చెందిన జనసైనికుడు చందూ వీర వెంకట వసంతరాయలు గాయపడ్డారు.
అనంతరం చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కు గురయ్యారు. ఈ నేపథ్యంలో అవయవదానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకువచ్చారు.తాజగా దీనిపై డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. చందూ బ్రెయిన్ డెడ్ అయ్యారనే వార్త తీవ్ర బాధాకరమని పేర్కొన్నారు.
వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. యాక్సిడెంట్ అనంతరం గుంటూరు లోని రమేష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కు గురై వారి కుటుంబ సభ్యులకు చందూ తీరని శోకాన్ని మిగిల్చారని తెలిపారు.
అయినప్పటికీ వారి బాధను దిగమింగుకుని, మానవత్వాన్ని చాటుతూ ఆయన అవయవాలను ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు దానం చేసేందుకు ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమని చెప్పారు. వారు తీసుకున్న ఈ నిర్ణయంతో జీవితం మీద ఆశతో ఎదురు చూస్తున్న 7 మందికి జీవితాలకు భరోసా కల్పించారన్నారు.
ఎంతో బాధలో ఉన్నప్పటికీ ఇతరుల ప్రాణాలు నిలబెట్టి, వారి జీవితాల్లో వెలుగు నింపాలని నిర్ణయం తీసుకున్న వారి కుటుంబ సభ్యులను మనస్పూర్తిగా అభినందిస్తూ, సెల్యూట్ చేస్తున్నట్లు పవన్ వెల్లడించారు.









