Congress on LIC investment in Adani group | ఆదాని గ్రూప్ అధినేత గౌతమ్ ఆదాని మరియు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం పై ప్రఖ్యాత ‘వాషింగ్టన్ పోస్ట్’ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. అమెరికాలో ఆదానిపై క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన బ్యాంకులు ఆదాని కంపెనీకి లోన్లు ఇవ్వడానికి నిరాకరించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ ద్వారా ఎల్ఐసీ పై ఒత్తిడి తీసుకువచ్చి ఆదాని కంపెనీలో 3.9 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.34,000 కోట్లను పెట్టుబడి పెట్టించినట్లు సదరు కథనంలో వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించింది. ఈ ఆరోపణలు భారత్ లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నరేంద్ర మోదీ తన ‘ప్రియ మిత్రుడు’ అదానీ కోసం ఏమైనా చేయగలరని విమర్శించింది. ప్రధాని మోదీ దేశవాసుల కష్టార్జితాన్ని కూడా పణంగా పెట్టగలరని మండిపడింది.
అమెరికాలో అదానీపై లంచం ఇచ్చిన కేసు నమోదు అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు రుణం ఇవ్వడానికి నిరాకరించాయి, అప్పుడు మోదీ ప్రభుత్వం LIC పై ఒత్తిడి తెచ్చి అదానీ కంపెనీల్లో 3.9 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టించిందని పేర్కొంది. దీని తర్వాత LICలో పెట్టుబడి పెట్టిన సామాన్య ప్రజల కష్టార్జితం ఒక్కసారిగా అదానీకి అప్పగించబడిందని తద్వారా అదానీ వ్యాపారం విస్తరించి తన అప్పులు తీర్చుకోగలడని కాంగ్రెస్ పార్టీ ఫైర్ అయ్యింది.
మోదీ ప్రభుత్వం బలవంతంగా LIC ద్వారా ఈ పెట్టుబడులు పెట్టించినట్లు ఆరోపించింది. LIC ఇంతకుముందే అదానీ షేర్లలో పెట్టుబడి పెట్టి రూ.వేల కోట్లను నష్టం పోయిందని ఈ డబ్బు దేశ ప్రజలది, ప్రజల కష్టార్జితం, దానిని నరేంద్ర మోదీ తన మిత్రుడు అదానీని రక్షించడానికి దోచుకుంటున్నారని నిప్పులుచెరిగింది. నరేంద్ర మోదీకి దేశ ప్రజల గురించి శ్రద్ధ లేదు మరియు ఆయన రేయింబవళ్లు కేవలం తన మిత్రుడు అదానీ కోసమే పనిచేస్తారని హస్తం పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది.










