CM Revanth Reddy at Cognizant | ఇటీవల అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్ కు వచ్చారు. అనంతరం సాయంత్రం నగరంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా, కొరియాలో తాము కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పొరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఈ పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని వెల్లడించారు. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు చెప్పారు.
పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
‘ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ. రాష్ట్రానికి మూడు రింగ్స్ ఉన్నాయి. మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్. రెండోది సెమీ-అర్బన్ ఏరియా.. ఇక్కడ మేం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మూడోది రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్న రూరల్ తెలంగాణ. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ అభివృద్ధి చేస్తాం.
వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది మా సంకల్పం. కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని నేను హామీ ఇచ్చాను. హైదరాబాద్లో కాగ్నిజెంట్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. హైదరాబాద్ నగరానికి నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. రాజీవ్ గాంధీ గారి కృషితో హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి పునాది పడింది.
ఆ తరువాత చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐటీ అభివృద్ధిని కొనసాగించారు. సైబరాబాద్ సిటీని అభివృద్ధి చేశారు. హైదరాబాద్ లాగే కాగ్నిజెంట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గుర్తింపు పొందింది. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి భేషజాలు లేవు.
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగే ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. మా చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్దే నిరూపిస్తుంది. మా పోటీ ఏపీ, కర్ణాటకతో కాదు… మా పోటీ ప్రపంచంతో పక్క రాష్ట్రాలలో ఎక్కడా హైదరాబాద్ లాంటి నగరం లేదు.. పక్క రాష్ట్రాలతో మాకు పోటీ లేదు.
హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతం. పారిశ్రామిక వేత్తలకు ఈ వేదికగా పిలుపునిస్తున్నా. రండి పెట్టుబడులు పెట్టండి.. మీకు కావలసిన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది’ అని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.