Cm Revanth Reddy About Miss World 2025 | తెలంగాణ ఖ్యాతిని విశ్వమంతటికీ పరిచయం చేయాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న MissWorld2025 పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మే 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగే ఈ ప్రపంచ స్థాయి పోటీల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా వారికి తెలంగాణ ఆతిథ్యం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ మేరకు మిస్ వరల్డ్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోటీదారులతో పాటు దేశ విదేశాల నుంచి ఈవెంట్ కవరేజీకి దాదాపు 3 వేల మంది మీడియా ప్రతినిధులు, అతిథులకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో స్వాగతించాలని సూచించారు.
MissWorld కు వచ్చే విదేశీ అతిథులు బస చేసే హోటళ్లతో పాటు హైదరాబాద్లో వారు పర్యటించనున్న చార్మినార్, లాడ్బజార్, చౌమహల్లా ప్యాలెస్, సెక్రటేరియట్ తెలంగాణ తల్లి వంటి ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు.
మహిళా సాధికారతను చాటిచెప్పేలా రాష్ట్రంలో ఐకేపీ మహిళలు నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్ సందర్శనతో పాటు, ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సెమీఫైనల్స్ తిలకించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. హైదరాబాద్లో మిస్ వరల్డ్ కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు అంతరాయం రాకూడదన్నారు.
రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులను ప్రభుత్వం తరఫున మిస్ వరల్డ్ 2025 ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కస్తూరిబా పాఠశాలలకు చెందిన విద్యార్థులను కూడా ఒకరోజు మిస్ వరల్డ్ వేడుకలు చూపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
వేడుకలు జరిగే రోజుల్లో హైదరాబాద్ అంతటా మిస్ వరల్డ్ సందడి కనిపించేలా తోరణాలు, లైటింగ్, హోర్డింగ్లతో పాటు సిటీలోని ముఖ్యమైన జంక్షన్లు, చారిత్రక ప్రదేశాలను అందంగా అలంకరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.