Cm Chandrababu News | రాయలసీమ ప్రాంతానికి నీళ్లిచ్చి రైతన్నలకు మంచి చేసే కార్యక్రమంలో కలిగే సంతోషం ఎప్పుడూ ప్రత్యేకమే అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో చంద్రబాబు గురువారం పర్యటించారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మనసుకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉందన్నారు సీఎం.
రాయలసీమకు జీవనాడి హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ పనులు శరవేగంగా పూర్తిచేసినట్లు చెప్పారు. మొదటి ఫేజ్ పూర్తి చేసి మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నీటిని విడుదల చేసినట్లు హర్షం వ్యక్తం చేశారు. హంద్రీనీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2200 క్యూసెక్కుల నుంచి 3850 క్యూసెక్కులకు పెంచడం వల్ల సీమ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని అని చెప్పారు.
రికార్డు స్థాయిలో ఈ పనులు పూర్తి చేయడంలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా సీఎం అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో త్వరలోనే ఫేజ్ 2 పనులు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీటిని అందించే ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
నీళ్లిస్తే రైతులు బంగారం పండిస్తారని, సంపద సృష్టికి మూలమైన జలాన్ని ప్రతి ఎకరాకు అందిచాలనే సంకల్పాన్ని అందరి దీవెనలతో సహకారంతో నెరవేరుస్తామన్నారు. రైతన్నల సాగునీటి కష్టాలు తీర్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచనున్నట్లు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.









