Cm Chandrababu-Cm Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన ఆరోపణలు చేసింది భారత రాష్ట్ర సమితి.
ప్రజాభవన్ వేదికగా గురుశిష్యులు భేటీ అయి సరిగ్గా ఏడాది గడుస్తోందని,న్వీరిద్దరి మధ్య ఉన్న ఫెవికాల్ బంధం తెలంగాణ రైతుల గొంతు కోస్తోందని ఆరోపించింది బీఆరెస్. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆస్తులు, అప్పుల వివాదాలపై చర్చల పేరిట జరిపిన ఈ భేటీకి ఏడాది గడిచినా కనుగొన్న పరిష్కారాలు మాత్రం సున్నా అని ఎద్దేవా చేసింది.
ఇటీవల ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తెరపైకి తెచ్చిన బనకచర్ల బాగోతానికి కూడా ఏడాది క్రితమే ప్రజాభవన్ వేదికగా పునాది పడినట్టు తేలిపోయిందంది. పైకి విభజన చట్టంలోని అంశాలపై చర్చల పేరిట.. లోలోపల కుమ్మక్కు రాజకీయాలు, తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేందుకు ఇద్దరూ కలిసి చేస్తున్న పన్నాగాలను చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ సమాజం ఎప్పుడో పసిగట్టేసిందని పేర్కొంది.
రాజకీయంగా భిక్షపెట్టిన ఏపీ సీఎంకు గురుదక్షణగా తెలంగాణ నీటి హక్కులను, రైతుల ప్రయోజనాలను ఏపీ ముఖ్యమంత్రికి, సీఎం రేవంత్ తాకట్టు పెడితే 70 లక్షల మంది అన్నదాతలు ఊరుకునే ప్రసక్తే లేదని గులాబీ పార్టీ హెచ్చరించింది.
బీఆర్ఎస్ ను, పార్టీ అధినేత కేసీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోలేక చీకటి ఒప్పందాలతో చేస్తున్న కుయుక్తులను తిప్పికొట్టేందుకు నాలుగు కోట్ల పిడికిళ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.
కేంద్రంలో బీజేపీ, పక్కరాష్ట్రంలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి తెలంగాణపై ఏడాది కాలంగా చేస్తున్న మూకుమ్మడి కుట్రలకు ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం తప్పదని బీఆరెస్ హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.