BRS MLA Lasya Nanditha | బీఆర్ఎస్ పార్టీ (BRS Party) లో తీవ్ర విషాదం నెలకొంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) మృతి చెందారు.
శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై జరిగిన ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే లాస్య నందిత స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
డ్రైవర్ నిద్రమత్తు, ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు అన్నికోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఈనెల 13న కూడా ఆమె కారు ప్రమాదానికి గురైంది. బీఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన లాస్యనందిత హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో నార్కట్పల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డుపక్కకు దూసుకెళ్లటంతో ఓ హోంగార్డు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో లాస్య నందిత స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగి పది రోజులకే ఆమె మరో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు.
లాస్య తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్నకూడా గతేడాది ఫిబ్రవరిలో మరణించారు. సరిగ్గా ఏడాదికే లాస్య కూడా మరణించడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. దివంగత ఎమ్మెల్యే సాయన్న వారసురాలిగా లాస్య నందిత రాజకీయాల్లోకి వచ్చారు.
2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పికెట్ నాలుగో వార్డు నుంచి సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలుపొందారు. అనంతరం 2021 గ్రేటర్ ఎన్నికల్లో కవాడిగూడ కార్పొరేటర్గా పోటీ చేసిన ఆమె ఓటమిపాలయ్యారు.
గతేడాది తండ్రి మరణించడంతో 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందితకు కంటోన్మెంట్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గద్దర్ కుమార్తెపై 17 వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు.








