BJP minister’s remark on Colonel Sofia Qureshi stirs row | కర్నల్ సోఫియా ఖురేషి పై మధ్యప్రదేశ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. భారత త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో ‘ఆపరేషన్ సింధూర్’ ను చేపట్టిన విషయం తెల్సిందే.
ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రి తో కలిసి సోఫియా ఖురేషి మీడియా ద్వారా వెల్లడించారు. అనంతరం పాక్ దాడులను భారత్ ఎలా తిప్పికొట్టింది, దాయాధి దేశ వక్రబుద్దిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు.
కాగా మంగళవారం మధ్యప్రదేశ్ ఇండోర్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి విజయ్ షా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘ మన ఆడబిడ్డల సిందూరాన్ని చెరిపేసిన వారి అంతు చూడాలని.. వారి సామాజిక వర్గానికి చెందిన సోదరిని ప్రధాని మోదీ పంపారు.
మన హిందువులను హత్య చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి వారి జాతి బిడ్డను పంపించాం’ అంటూ మంత్రి వ్యాఖ్యానించడం తీవ్ర వివాదంగా మారింది. దింతో ప్రతిపక్షాలు బీజేపీపై మండిపడుతున్నాయి. ఆయన్ను మంత్రి పదవి నుండి తొలగించాలని కాంగ్రెస్ నాయకులు ప్రధానిని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు మధ్యప్రదేశ్ బీజేపీ అధిష్టానం మంత్రిని పిలిపించి చివాట్లు పెట్టింది. ఈ క్రమంలో సోఫియా ఖురేషి ని కించపరిచాలనే ఉద్దేశ్యం తనకు లేదని, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధ పడితే క్షమాపణలు చెప్పడానికి సిద్ధమని మంత్రి పేర్కొన్నారు.