After 27 Years Jharkhand Family Finds Lost Member In Maha Kumbh | యూపీ ప్రయాగ్రాజ్ లో మహా కుంభమేళా కన్నులపండువగా సాగుతుంది.
కుంభమేళాలో పాల్గొన్న అఘోరాల, బాబాలు మరియు సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారన్న విషయం తెల్సిందే. అయితే అఘోర 27 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తల ఉన్నాడని ఓ మహిళ మరియు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే, ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన గంగాసాగర్ యాదవ్ 1998లో బీహార్ రాజధాని పట్నాకు వెళ్లి తిరిగిరాలేదు. అప్పటి నుండి ఆయన్ను వెతికేందుకు కుటుంబం ప్రయత్నిస్తూనే ఉంది.
ఇటీవల మహా కుంభమేళాకు వచ్చిన కొందరు కుటుంబ సభ్యులు అఘోరని చూసి ఆయన గంగాసాగర్ లానే ఉన్నడని ఫోటోలను కుటుంబ సభ్యులకు పంపారు.
నుదుటిపై గాయం, పొడవాటి పళ్ళు, మోకాలిపై మచ్చ వంటి పోలికలు గమనించిన కుటుంబ సభ్యులు అఘోర కచ్చితంగా తప్పిపోయిన గంగాసాగర్ యాదవే అని నిర్దారణకు వచ్చారు. ఈ క్రమంలో గంగాసాగర్ భార్య, ఇద్దరు కుమారులు మరియు తల్లి కుంభమేళా చేరుకుని అఘోర వద్దకు వెళ్లారు.
కానీ తాను రాజ్ కుమార్ అని, వారణాసికి చెందిన వాడినని అఘోర స్పష్టం చేశారు. తన గత జీవితం గురించి చెప్పడానికి నిరాకరించారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం అఘోర మాటల్ని నిరాకరించారు.
గంగాసాగర్ భార్య ధన్వాదేవి డీఎన్ఏ టెస్టు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు కుంభమేళా పోలీసులను ఆశ్రయించింది. కుంభమేళా ముగిసే వరకు వేచి చూసి డీఎన్ఏ టెస్టు చేయాలని, ఒకవేళ అఘోర తన భర్త కాకపోతే క్షమాపణలు కోరుతామని ఆమె పేర్కొంది.
గంగాసాగర్ ఇంటినుండి వెళ్లిపోయిన సమయానికి వారి పెద్ద కుమారుడుకి రెండేళ్ల వయస్సు, చిన్న కుమారుడు ఇంకా జన్మించలేదు. గంగాసాగర్ యాదవ్ సోదరుడు మురళి యాదవ్ తన అన్నగా భావిస్తున్న అఘోరని చూసి ఆనందం వ్యక్తం చేశారు.
కాగా ఇప్పటికే కొందరు కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వెళ్లారు. మరికొందరు మాత్రం కుంభమేళాలోనే ఉంటూ అఘోరని నిత్యం గమనిస్తూ ఉన్నారు. వారు మహా కుంభమేళా ముగిసే వరకు వేచి చూడనున్నారు.










