Adivi Sesh appeals CJI about mass confinement of street dogs | వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునర్విచారణ చేయాలని కోరుతూ సినీ నటుడు అడవి శేష్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్కు లేఖ రాశారు.
ఢిల్లీ మరియు నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో వీధి కుక్కల బెడద, కుక్కకాటు, రేబిస్ వంటి కారణాల మూలంగా మరణాలు పెరుగుతున్నాయని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సుమోటోగా కేసును స్వీకరించి కుక్కలను నివాస ప్రాంతాల నుంచి దూరంగా ఉండే షెల్టర్లకు తరలించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అలాగే ఎనిమిది రోజుల్లో షెల్టర్లు నిర్మించి, కుక్కలను తరలించి నివేదిక సమర్పించాలని, స్టెరిలైజేషన్, టీకాలు వేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు పై జంతు హక్కుల సంస్థలు, లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ వంటివారు ఆక్షేపణలు తెలుపుతున్నారు.
ఇదే సమయంలో వీధి కుక్కల అంశంలో జారీ చేసిన ఆదేశాలను పునఃపరిశీలించాలని కోరుతూ అడవి శేష్ సీజేఐ బీఆర్ గవాయ్ కి లేఖ రాశారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు కూడా లేఖ రాసినట్లు తెలిపారు. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించడం ఆచరణ సాధ్యం కాదని, ఇది జంతు హక్కులకు విరుద్ధమని అడవి శేష్ లేఖలో ప్రస్తావించారు.










