Ys Sharmila Shocking Comments On Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.
పవన్ కళ్యాణ్ చే గువేరా, గద్దర్ సిద్ధాంతాలకు నీళ్ళొదిలేసి ఇప్పుడు నరేంద్రమోదీ, అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని విమర్శించారు. RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనా పార్టీని “ఆంధ్ర మతసేనా” పార్టీగా మార్చారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణమన్నారు. సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్రరాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా జనసేన వైఖరి ఉండటం విచారకరమని పేర్కొన్నారు.
పార్టీ పెట్టి 11 ఏళ్లు పోరాడి, ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టి, మతం రంగు పూసుకుని, ఒకరి ప్రయోజనాలే లక్ష్యం అన్నట్లుగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని చెప్పి, మత పిచ్చి బీజేపీ ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ ఇప్పటికైనా మేల్కోవాలని బీజేపీ మైకం నుంచి బయట పడాలని షర్మిల సూచించారు.