Ys Sharmila Latest News | రాష్ట్ర రైతాంగాన్ని ఎర్రబంగారం ఏడిపిస్తోందని మిర్చి పంట నష్టాల ఘాటుకు రైతన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.
పెట్టుబడి మందం రాక అడ్డికి పావుషేరు కింద అమ్ముకుంటూ రైతు కన్నీళ్లు పెడుతుంటే.. క్వింటాకు రూ. 15 వేల నష్టంతో అమ్ముకుంటుంటే.. అండగా నిలవాల్సిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం మిర్చి రైతుల కళ్ళలో కారం కొడుతుందని ధ్వజమెత్తారు.
మిర్చి రైతులకు రూ.11 వేల మద్దతు ధర ఇచ్చి ఉద్దరించినట్లు కూటమి ప్రభుత్వం గఫ్ఫాలు కొడుతుందని విమర్శించారు. నిజంగా రాష్ట్ర రైతులపై కేంద్రానికి ప్రేమనే ఉంటే.. వెంటనే మిర్చి పంటకు కనీస ధర రూ.26 వేలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతున్న మిర్చి రైతును ఆదుకొనేలా ధరల స్థిరీకరణ నిధి వెంటనే అమలు చేయాలన్నారు. కేంద్రం ఇచ్చే ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతుకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మిర్చి రైతు విలవిలలాడుతుంటే టమాట సాగు చేస్తున్న రైతులకు తీరని కష్టాలు వచ్చి పడ్డాయని షర్మిల తెలిపారు. గిట్టుబాటు ధర లేక, కనీసం పెట్టుబడి రాక, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ధరలు పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని షర్మిల ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.