Ys Sharmila Latest | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి భారతి పై చేబ్రోలు కిరణ్ అసభ్యకర వ్యాఖ్యలు చేసాడు.
ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. భారతి రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని షర్మిల తెలిపారు. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమన్నారు.
ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదని, ఏ పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్ష పడాలని పేర్కొన్నారు.
వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఉందని ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ ,టీడీపీలే నని షర్మిల అన్నారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శమని విమర్శించారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉచ్ఛం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. రక్త సంబంధాన్ని మరిచారు, రాజకీయ కక్ష్యతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు, మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారు, అన్యం పుణ్యం ఎరుగని పసి పిల్లలను సైతం గుంజారు, అక్రమ సంబంధాలు అంటగట్టారని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని సూచించారు.