Ys Jagan In Guntur Market Yard | మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ బుధవారం గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను పరామర్శించారు.
అనంతరం మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తే చంద్రబాబు ( Cm Chandrababu ) కనీసం పోలీసు భద్రతను కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తిరిగి ప్రతిపక్షంలోకి వచ్చాక తాము పోలీసు భద్రత ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని సూచించారు.
ధరల్లేక, పంటను కొనేవారు లేక మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయని ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరచి రైతే రాజని గుర్తించాలని పేర్కొన్నారు. రైతు కన్నీరు పెట్టుకుంటే… అది రాష్ట్రానికి అరిష్టమన్నారు.
చంద్రబాబు గుంటూరు మార్కెట్ యార్డుకు వచ్చి, మిర్చి రైతులతో మాట్లాడి, వారికి బాసటగా నిలవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలుచేసి రైతులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా కూటమి సర్కార్ ను డిమాండ్ చేశారు.