Virat Kohli Test Retirement News | టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడం సంచలనంగా మారింది. రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయంతో అభిమానులు షాక్ కు గురయ్యారు.
ఇదే సమయంలో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కూడా టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తారని కథనాలు రావడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో విరాట్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు.
అలాగే కోహ్లీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. కీలకమైన ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోవద్దని బీసీసీఐ కూడా కోరినట్లు తెలుస్తోంది.
అనుభవం ఉన్న జట్లు కూడా ఇంగ్లాండ్ లో జరిగే టెస్టుల్లో తడబడుతాయి. కోహ్లీ లాంటి అనుభవం ఉన్న ఆటగాళ్లు జట్టుకు తోడుగా ఉండాలి. కోహ్లీ టీం ఇండియాకు ఆపద్బాంధవుడు అవుతాడు అని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ తరుణంలో అంబటి రాయుడు స్పందించారు.
‘విరాట్ దయచేసి రిటైర్ అవ్వొద్దు. మునపటికన్నా ఇప్పుడు నువ్వు టీం ఇండియాకు చాలా అవసరం. మీలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉంది. టీంఇండియా తరఫున కోహ్లీ బరిలోకి దిగకపోతే టెస్టు క్రికెట్ కు కళ ఉండదు. దయచేసి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోండి’ అని అంబటి కోరారు.