Friday 3rd April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రేవంత్ రెడ్డివి అబద్ధాల రాజకీయాలు: కిషన్ రెడ్డి

రేవంత్ రెడ్డివి అబద్ధాల రాజకీయాలు: కిషన్ రెడ్డి

BJP Kishan REddy

– కేరళలో ప్రచారంపై తీవ్ర విమర్శలు!

Kishan Reddy Slams CM Revanth | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పూర్తిగా విఫలమయ్యాయని, అయినా అమలు చేశామంటూ కేరళ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, అమలు చేయని పథకాలను చేసినట్లు చెప్పుకోవడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

మహిళలకు నెలకు రూ. 2,500, పెన్షన్ల పెంపు, దళిత కుటుంబాలకు రూ. 12 లక్షలు మరియు బీసీలకు లక్ష కోట్ల కేటాయింపు వంటి హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.

నిరుద్యోగ భృతి, తులం బంగారం, ఎలక్ట్రిక్ స్కూటర్ల హామీలను విస్మరించి, పొరుగు రాష్ట్రాల్లో గొప్పలు చెప్పుకోవడం ప్రజలను దగా చేయడమేనని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమైందని, పూర్తిస్థాయిలో సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని, లక్ష కోట్లు వసూలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఆరోపించారు.

కేరళకు రేవంత్ రెడ్డిని పిలవడం వెనుక తెలంగాణ నుంచి నిధులు పంపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అక్కడ ఆయన మాటలకు విలువ లేదని ఎద్దేవా చేశారు.

తమ అసమర్థతను దాచుకోవడానికి బీజేపీపై నెపం వేయడం మానుకోవాలని, హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.

You may also like
Metro
మహిళా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్!
Chandra Babu Naidu
తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions