TTD News | సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరుగనుందని టీటీడీ ప్రకటించింది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని పేర్కొంది. పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తోంది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది.
రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు. ఈ నేపథ్యంలో ఆరోజు తిరుమలలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు. జనవరి 25 తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం ఆ తర్వాత చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, చక్రస్నానం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనం ఇస్తారు.









