Toxic metals found in Sunnam Cheruvu | హైదరాబాద్ మాదాపూర్ లోని సున్నం చెరువు నీటిని తాగితే ఆరోగ్యాన్ని ప్రమాదమని హెచ్చరించింది హైడ్రా. మహానగరంలోని ఆరు చెరువుల పునరుజ్జీవనం కోసం కృషి చేస్తున్న హైడ్రా తొలుత సున్నం చెరువుపై దృష్టి సారించింది.
ఇందులో భాగంగా చెరువులో నీటిని సేకరించి పీసీబీ సహకారంతో పరీక్షించింది. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడి భూగర్భ జలాలు ఎంతటి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయో అనే అంశాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా పరీక్షించింది.
సీసం, కాడ్మియం, నికెల్ లోహాల మోతాదులు అధికంగా ఉన్నాయని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పీసీబీ హెచ్చరించింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన మోతాదులో కాకుండా.. రెండింతలు, మూడింతలు, 12 రెట్లు అధికంగా ఉండి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయని పీసీబీ పరిశోధనల్లో వెల్లడైంది.
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక లీటరు నీటిలో 0.01 మిల్లీగ్రాముల సీసం (Lead -Pb) వరకూ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాని సున్నం చెరువు చుట్టూ ఉన్న బోరు నీటిలో 0.073 – 0.122 ఉన్నట్టు పీసీబీ గుర్తించింది. అంటే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఫర్వాలేదు అనుకునే స్థాయిలో 7 నుంచి 12 రెట్లు అధికంగా ఉన్నట్టు వెల్లడైంది.
సున్నం చెరువు చెంతకు వెళ్తేనే దుర్వాసన భరించలేమని ఇలాంటి చోట బోర్లు వేసి ఆ నీటిని తాగునీటిగా మాధాపూర్ పరిసరాల్లోని విద్యా సంస్థలు, వసతి గృహాలు, హోటళ్లకు సరఫరా చేసి ప్రాణాలమీదకు తెస్తున్నారని వ్యాపారులపై హైడ్రా ఆగ్రహం వ్యక్తం చేసింది.










