Piracy in Tollywood | తెలుగు చలనచిత్ర పరిశ్రమను పైరసీ భూతం మరోసారి వణికిస్తోంది. ఇటీవల థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సినిమాలతో పాటు, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన భారీ చిత్రాలను కూడా పైరసీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
దీనిపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు.
పైరసీ ముఠాలు లక్ష్యంగా చేసుకున్న ఐదు ప్రముఖ చిత్రాల జాబితాలో ఉస్తాద్ భగత్ సింగ్, రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీనారీ నడుమ మురారి ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ వెబ్సైట్లపై కేసు నమోదు..
ఫిలిం ఛాంబర్ అందించిన ఆధారాల మేరకు, ఈ సినిమాల పైరసీకి కారణమైన వెబ్సైట్లను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
5 మూవీరుల్జ్ (MovieRulz) వెబ్సైట్లు, 1 సినీవుడ్ (CineVood) వెబ్సైట్ 1 తమిళ్ ఎంవీ (TamilMV) వెబ్సైట్ ఉన్నాయి.
సైబర్ క్రైమ్ విభాగం ఈ వెబ్సైట్ల ఐపీ అడ్రస్లను ట్రేస్ చేస్తోంది. కోట్లాది రూపాయల బడ్జెట్తో నిర్మించిన చిత్రాలను ఇలా లీక్ చేయడం వల్ల నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.
పైరసీని ప్రోత్సహించవద్దని, కేవలం థియేటర్లలోనే సినిమా చూడాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.






