- సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Minister Adluri Laxman: గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు సూచించారు.
సెక్రటేరియట్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన “గోదావరి పుష్కరాలు–2027 కేబినెట్ సబ్ కమిటీ” తొలి సమావేశం మంగళవారం జరిగింది.
ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ తదితరులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలను ఈసారి కని విని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.
రాష్ట్ర ప్రతిష్ఠకు అనుగుణంగా పుష్కరాల ఏర్పాట్లు అత్యంత ప్రాముఖ్యంతో చేపట్టాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించినట్లు చెప్పారు.
గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాలకు తరలివస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గోదావరి తీరం విస్తరించి ఉండటంతో పాటు అక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉండటంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సహా గోదావరి తీరం వెంట ఉన్న ఆలయాలను దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు.
అందువల్ల ఘాట్ల అభివృద్ధి, తాత్కాలిక స్నాన ఘాట్లు, రహదారుల విస్తరణ, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్య సేవలు, భద్రత వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
పుష్కరాల సమయంలో భక్తులకు సౌకర్యవంతమైన రవాణా కోసం ప్రత్యేక బస్సులు, తాత్కాలిక వసతి కేంద్రాలు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే విపత్తు నిర్వహణ, పోలీస్ భద్రత, వైద్య అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు.
ఇటీవల సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించారని గుర్తుచేశారు. అదే విధంగా గోదావరి పుష్కరాలను కూడా మరింత వైభవంగా నిర్వహించి తెలంగాణ ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా నిలబెట్టాలని మంత్రి తెలిపారు.
పుష్కరాల సందర్భంగా పర్యాటక అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్రానికి వచ్చే భక్తులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని పరిచయం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో సూచించారు.










