- తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు..
TG Cabinet Decisions | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. సామాజిక భద్రత, మత సామరస్యం, న్యాయవాదుల రక్షణే లక్ష్యంగా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది.
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు మరియు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. వారి వేతనం నుంచి 15 శాతం లేదా రూ. 10,000 నేరుగా కట్ చేసి తల్లిదండ్రులకు అందజేసేలా ఈ బిల్లును రూపొందించారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 (69 కి.మీ)ను ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఇందుకోసం రూ. 15 వేల కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలోని 4.2 లక్షల మంది గిగ్ వర్కర్ల కోసం “తెలంగాణ ప్లాట్ఫాం బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్-2026″ను ఆమోదించింది. వీరి కోసం ప్రత్యేక సంక్షేమ నిధి, బోర్డును ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే పోస్టులు, విద్వేషపూరిత ప్రసంగాలను అడ్డుకునేందుకు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
“తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్ 2026″ను మంత్రివర్గం ఆమోదించింది. అల్లర్లను ప్రేరేపించే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు, వారికి తగిన రక్షణ కల్పించేలా అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును రూపొందించారు.
గతంలో జరిగిన వామనరావు దంపతుల హత్య వంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ సమర్పించిన సమగ్ర కులగణన సర్వే నివేదికను కేబినెట్ ఆమోదించింది.
దీనిపై తదుపరి చర్యల కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. విద్యాలయాల్లో కుల వివక్షను నిర్మూలించేందుకు ఉద్దేశించిన ‘రోహిత్ వేముల చట్టం’ విధివిధానాల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు.










