PM Modi Telangana Tour | ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న తెలంగాణ పర్యటనకు రానున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది. అయితే తాజాగా ప్రధాని పర్యటన వాయిదా పడినట్లు మరో ప్రకటన వెలువడింది.
ప్రధాని మోదీ పర్యటన వాయిదాపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పీఎంవో నుంచి సమాచారం వచ్చింది. తిరిగి పర్యటన ఎప్పుడనేది త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది.
బిజీ షెడ్యూల్ వల్లే ప్రధాని తెలంగాణ పర్యటన వాయిదా పడిందని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. త్వరలోనే మోదీ పర్యటన ఉంటుందని పేర్కొన్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించేందుకు ఈ నెల 19న మోదీ హైదరాబాద్ కు రావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల పర్యటన వాయిదా పడింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నం మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ను మోదీ ప్రారంభించాల్సి ఉంది. ఈ రైలును మొదట సికింద్రాబాద్-విజయవాడ మధ్య ఈ నడపాలని దక్షిణ మధ్య రైల్వేశాఖ నిర్ణయించింది.
కానీ ఆ తర్వాత విశాఖపట్నం వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాల్సిన వందే భారత్ రైలు కాస్త ఆలస్యం కానుండటంతో ఈ వందే భారత్ రైలు ప్రయాణాన్ని విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు పొడింగించారు.
ఏపీ వందే భారత్ రైలును విజయవాడ, విశాఖపట్నం మధ్య నడిపనున్నారు. ఈ రైలు రావడానికి మరికొన్ని రోజులు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.