PM Modi Inaugurates Chenab Bridge | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా నిలిచిన చీనాబ్ రైల్వే వంతెనను (Chenab Railway Bridge) ప్రారంభించారు.
కశ్మీర్ లోయలోని జమ్మూ కశ్మీర్ లోని రాంబన్ జిల్లా సాంగల్దాన్ నుంచి రియాసీ జిల్లాను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెన కశ్మీర్ ప్రజలకు ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా మారనుంది.
రైలు మార్గం ద్వారా కశ్మీర్ ను భారత్ లోని మిగతా ప్రాంతాలకు అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్ – శ్రీనగర్ – బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగం ఇది. ఈ ప్రతిష్ఠాత్మక వంతెనను అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు ప్రధాని మోది.
చీనాబ్ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఈ రైల్వే వంతెనను నిర్మించారు. దీని పొడవు 1315 మీటర్లు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్ నదిపై ఉన్న షుబాయ్ రైల్వే వంతెన (275 మీటర్ల ఎత్తు) పేరుతో ఉన్న ప్రపంచరికార్డును ఇది అధిగమించింది. ఈఫిల్ టవర్ కంటే చీనాబ్ వంతెన ఎత్తు 30 మీటర్లు ఎక్కువ.
ఈ వంతెన ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ భారతదేశపు మొట్టమొదటి కేబుల్ ఆధారిత రైల్వే వంతెన అయిన అంజి వంతెనను కూడా ప్రారంభించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సరిహద్దు దాటి చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి.