PM Modi Hails Telangana’s Tribal Women For Making Ippa Puvvu Laddu | ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో వివిధ అంశాల గురించి మాట్లాడుతారు. ఇందులో భాగంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు తయారుచేస్తున్న ఇప్ప పువ్వు లడ్డూ గురించి ప్రస్తావించారు.
ఆదిలాబాద్ సోదరీమణులు ఇప్ప పువ్వుతో ప్రయోగం చేశారని, వారి వంటల్లో ఆదివాసి సంస్కృతి, తీయదనం దాగి ఉందని పేర్కొన్నారు. గిరిజన మహిళలు తయారుచేస్తున్న ఇప్ప పూల లడ్డులనూ అందరూ ఎంతో ఇష్టంతో తింటారని పేర్కొన్నారు.
ఉట్నూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళలు భీంబాయి ఆదివాసీ సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ లడ్డూలను తయారుచేస్తున్నారు. వీటిని రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీలు, బాలింతలకు అందజేస్తున్నారు. దేశంలో తొలిసారిగా 2020లో పైలట్ ప్రాజెక్టు కింద ఆదిలాబాద్ జిల్లాలో 1845 మందికి, కుమురంభీం జిల్లాలో 817 మందికి ఇప్ప పూల లడ్డును పంపిణిచేశారు.
ఒక్కో లడ్డూ సుమారు 20 గ్రాముల బరువు ఉండగా, కిలో లడ్డూల ధర రూ.300గా నిర్ణయించారు. ఇందులో ఇప్పపువ్వులు, బెల్లం, నువ్వులు, పల్లీలు, కిస్మిస్, మంచి నూనె వంటివి కలుపుతారు. కాగా ప్రధాని తమ లడ్డూలను మెచ్చుకోవడం పట్ల ఆదివాసీ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.