- శరద్ పవార్ పై అజిత్ పవార్ తిరుగుబాటు
- ఎనిమిది మందితో కలిసి పార్టీలో చీలిక
- శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరిక
Maharashtra Politics | గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న మహారాష్ట్ర రాజకీయాలు మళ్ళీ జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచాయి.
ఈ సారి మాజీ డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నేత అజిత్ పవార్ (Ajit Pawar) తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు తెర పైకి వచ్చాయి.
అజిత్ పవార్ గత కొంత కాలంగా పార్టీ పై మరి ముఖ్యంగా శరద్ పవార్ (Sharad Pawar)పై గుర్రుగా ఉంటున్నారు.
అది కాస్తా ఆదివారం తారాస్థాయికి చేరింది. దీతో అజిత్ పవార్ సహా ఎనిమిది మంది శాసనసభ్యులతో ఎన్సీపీ నుండి బయటకి వచ్చి ఏకనాథ్ షిండే- బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వంలో చేరారు.
2019 చివరిలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి బీజేపీ-శివసేన (BJP -Sivasena) కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది.
కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు కూర్చోవాలి అనే విషయంలో పేచీ వచ్చింది.
కానీ అనూహ్యంగా అజిత్ పవార్ ఎన్సీపీ కి సంబంధం లేకుండా బీజేపీ కి మద్దతు తెలిపి, దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి, అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయ్యారు.
ఆ ప్రభుత్యానికి మెజారిటీ లేనందున ఎక్కువ సమయం నిలవలేదు.
తర్వాత శివసేన తన చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్, ఎన్సీపీ తో కలిసి మహా వికాస్ ఆగాడి (MVA) కూటమిగా ఏర్పడి ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అయ్యారు.
అజిత్ పవార్ తిరిగి ఎన్సీపీ గూటికి వచ్చి మళ్ళీ డిప్యూటీ సీఎం అయ్యారు. అలా కొంతకాలం కొనసాగిన తర్వాత శివసేన పార్టీ లో ఏకనాథ్ షిండే రూపంలో పెద్ద చీలిక వచ్చించి.
ఏకనాథ్ షిండే 2022 జూన్ లో కొంతమంది శివసేన ఎమ్మెల్యేల సహకారం తో ఉద్ధవ్ థాక్రేను విభేదించి బీజేపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి, దేవేంద్ర ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.
ఇలా మహారాష్ట్రలో రాజకీయాలు మలుపులు తిరుగుతూ వస్తున్నాయి.
తాజాగా ఆదివారం అజిత్ పవార్ కూడా శివసేన సీన్ ని రిపీట్ చేశారు. 8 మంది ఎమ్మెల్యేలతో ఎన్సీపీలో చీలిక తెచ్చి ఏకనాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వంలో చేరారు.
దీంతో అజిత్ పవార్ మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా, ఇతర ఎన్సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రాధాన్యం లేకపోవడంతోనే..
శరద్ పవార్ నేతృత్వంలో ఉన్న ఎన్సీపీలో అజిత్ పవార్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన వర్గం వారి వాదిస్తోంది.
శరద్ పవార్ కొన్నిరోజుల క్రితం ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తన కూతురు సుప్రియ సూలేని, అనుచరుడు ప్రఫుల్ పటేల్ ను నియమించారు.
కానీ అజిత్ పవార్ కు మాత్రం పార్టీలో ఎటువంటి పదవులు, బాధ్యతలు ఇవ్వలేదు. ఇలా తనను పార్టీ నుండి దూరం చేసే ప్రయత్నం జరుగుతుందని అజిత్ పవార్ పలు మార్లు ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ ఆదివారం అదును చూసి పార్టీలో చీలిక తీసుకువచ్చి శరద్ పవార్ కు షాక్ ఇచ్చాడు. అలాగే తనతో ఎన్సీపీకి చెందిన సుమారు 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు బాంబు పేల్చారు.
పార్టీని పునర్నిర్మిస్తా..
ఎన్సీపీలో చీలికపై స్పందించారు అధినేత శరద్ పవార్. మీడియాతో మాట్లాడుతూ ఈ చీలిక వస్తుందని ముందే ఊహించినట్లు తెలిపారు.
తాను మళ్లీ పార్టీని కింది స్థాయి నుండి పార్టీని పుననిర్మిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అజిత్ పవార్ ఇలా పార్టీకి వెన్నుపోటు పొడవటం అన్యాయమన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చెయ్యడమేనని వ్యాఖ్యానించారు. అలాగే దీని వెనుక బీజేపీ అధినాయకత్వం ఉన్నదని ఆరోపించారు.









