My Conscience Does Not Allow Me To Watch India vs Pak Match : Asaduddin Owaisi | పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో భారతీయులు మరణించిన తర్వాత ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచును చూడడానికి మనస్సాక్షి ఒప్పుకోవడం లేదని పేర్కొన్నారు.
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ‘ఆపరేషన్ సింధూర్’ పై లోకసభలో జరిగిన ప్రత్యేక చర్చ సందర్భంగా ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచును చూసేందుకు తన మనస్సాక్షి అనుమతించదని వెల్లడించారు. ఆసియ కప్-2025 షెడ్యూల్ ఇటీవలే విడుదల అయ్యింది.
ఇందులో భాగంగా టీం ఇండియా-పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగనుంది. అయితే దీనిపై ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు ఈ మ్యాచ్ ను నిర్వహించడం ద్వారా ఎటువంటి సంకేతం పంపుతున్నామని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.
ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాము, ఇప్పుడు మీరు ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచును చూడండి అని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం చెప్పగలదా అని ప్రశ్నించారు. పాకిస్థాన్ విమానాలు దేశ గగనతలంలో ప్రవేశించలేనప్పుడు, వాణిజ్యం ముగిసిన తర్వాత, పాకిస్థాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు ఎలా అనుమతినిస్తారు అని ఓవైసీ సభలో ప్రశ్నించారు.










