BRS MLA Sudheer Reddy | Hyderabad నగరంలో దోమల బెడద ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వానికి కళ్లకు కట్టేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు.
గురువారం అసెంబ్లీ సమావేశాలకు ఆయన చేతిలో ఫాగింగ్ యంత్రం, ఒంటికి దోమతెర ధరించి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
నగర ప్రజలు దోమల కాటుతో అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతూ ఆయన ఈ తరహా నిరసనకు దిగారు.
అయితే మొదట సుధీర్ రెడ్డి ఫాగింగ్ మిషన్, దోమతెరతో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, భద్రతా సిబ్బంది (మార్షల్స్) ఆయనను అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం వీటిని లోపలికి అనుమతించబోమని స్పష్టం చేయడంతో అక్కడ కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ఏవీ జరగడం లేదని, అలాంటప్పుడు లోపలికి వెళ్లడానికి కొత్త నిబంధనలు ఏమిటని ఆయన మార్షల్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారిని నెట్టుకుంటూ లోపలికి వెళ్లిన సుధీర్ రెడ్డి, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
హైదరాబాద్ ‘బ్రాండ్ ఇమేజ్’ దెబ్బతింటోంది..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ నగరం యొక్క అంతర్జాతీయ ప్రతిష్ట (Brand Image) మసకబారుతోందని సుధీర్ రెడ్డి విమర్శించారు. “దోమల భయానికి ప్రజలంతా నగరం వదిలి పారిపోయే పరిస్థితి నెలకొంది.
జీహెచ్ఎంసీ అధికారులు దోమల నియంత్రణకు కనీస చర్యలు తీసుకోవడం లేదు” అని ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వ హయాంలో దోమల నివారణకు శాస్త్రీయ పద్ధతులు పాటించేవాళ్ళమని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఫాగింగ్, స్ప్రేయింగ్ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.






