Latest Telangana News | చిన్నారుల్లో వినికిడి లోపం ఉందని గ్రహిస్తే వారిని వెంటనే హైదరాబాద్ కోటిలోని ఈఎన్టీ ఆసుపత్రిలో వైద్యులకు చూపించాలని ఇంటర్నేషనల్ కాక్లియర్ ఇంప్లాంట్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. చిన్న పిల్లల్లో వినికిడి లోపం ఉందని గమనిస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈఎన్టీ ఆసుపత్రిలో వైద్యుల సలహా మేరకు కాక్లియార్ ఇంప్లాంట్ లేదా ఇతర వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసీ జారీ చేసి చికిత్స అందిస్తామని ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాస్ తెలియజేశారు.
రాష్ట్రంలో చిన్నారులు ఎవరూ కూడా చెవుడు, మూగతనంతో బాధ పడకూడదని, అలాంటి వారందరికీ ప్రభుత్వమే అవసరమైన చికిత్స అందించాలనే సీఎం ఆదేశాల మేరకు గడిచిన రెండేళ్లలో వందలాది మందికి ఉచితంగా వైద్యం అందించి, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు చేయించినట్లు ఆయన తెలిపారు. చిన్నపిల్లలు ఈ లోపంతో బాధ పడుతున్నారని గ్రహిస్తే వెంటనే ఈఎన్టీ ఆసుపత్రిలో సంప్రదించాలని వేముల శ్రీనివాస్ ఒక సందేశంలో తల్లిదండ్రులను కోరారు. పిల్లల్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వారికి వైద్యం అందించగలిగితే ఈ లోపాన్ని అధిగమించడానికి వీలవుతుందన్నారు.










