Kunamneni Sambasiva Rao About Software Employees Struggle | సాఫ్ట్వేర్ ఉద్యోగులు..ఏసీ గదుల్లో సుఖంగా బ్రతుకుతున్నారని ఇతరులు అనుకున్నా వారిపై ఉండే మానసిక ఒత్తిడి మాత్రం వర్ణించలేని విధంగా ఉంటుంది.
ఒత్తుడి కారణంగా రూ.వేలల్లో, లక్షల్లో జీతాలు వచ్చినా వాటితో పాటే అనేక అనారోగ్య సమస్యలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని ఉద్దేశించి సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగులు 50 ఏళ్లకు వృద్ధులు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో శ్రమ దోపిడీ ఎక్కువన్నారు. కార్పోరేట్ సంస్థల కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ యవ్వనం, శక్తి, మేధస్సును ధారపోస్తున్నారని పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ అనేదే ఓ మాయాలోకం అని అభివర్ణించారు.
50 ఏళ్లకే సాఫ్ట్వేర్ ఉద్యోగులు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో వృద్దులుగా మారుతున్నారని చెప్పారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్మిక చట్టాల తీసుకురావాలని తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రతిపాదించారు.
అసలు రాష్ట్రంలో ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు, వారికి కార్మిక చట్టాలు అమలవుతున్నాయా, వారి పని గంటలు ఎన్ని, వారికి పదవీ విరమణ వయస్సు ఏమన్నా ఉందా, రిటైర్మెంట్ తర్వాత ఏమైనా బెనిఫిట్స్ లభిస్తున్నాయా, చట్టబద్ధంగా సౌకర్యాలు ఉన్నాయా అంటూ ఆయన ప్రశ్నించారు.