KTR Speech In Assembly | తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ కేటీఆర్ సభలో గణాంకాలతో విరుచుకుపడ్డారు.యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులు ధన్యవాదాలు చెప్పాలా?
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, 4 వేల నిరుద్యోగ భృతి అని ఆశచూపిన నిరుద్యోగ సోదరులు ధన్యవాదాలు చెప్పాలా? 4 వేల పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న 46 లక్షల మంది, 6 వేల పెన్షన్ కోసం అలసిపోయిన 5 లక్షల మంది దివ్యాంగులు ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలా? అని ప్రశ్నించారు.
డీఏలు రాక, పీఆర్సీ లేక ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు ధన్యవాదాలు చెప్పాలా? గురుకులాల్లో పురుగుల అన్నం తింటూ, విషాహారంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు కృతజ్ఞతలు చెప్పాలా? అని సభ సాక్షిగా నిలదీశారు.
భట్టి విక్రమార్క చెప్పినట్లు వంద రోజుల గడువు ముగిసినా గ్యారెంటీలు ఎక్కడ అమలవుతున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు.
తాను అడుగుతున్నవి తన సొంత ప్రశ్నలు కావని, రాష్ట్ర ప్రజల తరపున అడుగుతున్న ప్రశ్నలని స్పష్టం చేశారు. కేటీఆర్ ప్రసంగం సమయంలో సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.






