KTR News Latest | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తనను తీవ్రంగా వ్యక్తిత్వ హననం చేయాలని చూశారని పేర్కొన్నారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం సిట్ విచారణకు హాజరవడానికంటే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను డ్రగ్స్ తీసుకుంటానని, హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని వార్తలు రాసి తన కుటుంబాన్ని తీవ్ర క్షోభకు గురిచేశారని ఆవేదన చెందారు. ‘ఫోన్ ట్యాపింగ్ పేరిట లీకుల రూపంలో నా వ్యక్తిత్వ హననం చేసారు. నేను హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేశా అంటూ లీకులు ఇస్తారు, మళ్లీ అవి అబద్ధాలని చెప్తారు. మరి నా పరువు, ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవరు బాధ్యులు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఒక్క అధికారి అయినా ఈ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని చెప్పడానికి ముందుకు వస్తారా? అని సవాల్ విసిరారు. దేశంలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి ఎవరైనా ప్రభుత్వాలను అస్థిరపరచాలని కుట్ర చేసినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా వాటిని నివారించేందుకు పోలీసు వ్యవస్థ తన పని తాను చేసుకుంటుందని చెప్పారు. 2015లో బీఆరెస్ కు చెందిన ఎమ్మెల్సీని కొనుగోలు చేసేందుకు ఓ దొంగ రూ.50 లక్షల బ్యాగుతో దొరికారని, ఆ సమయంలో ఆ దొంగపై పోలీసులు నిఘా పెట్టి ఉండవచ్చని అవన్నీ పోలీసు వ్యవస్థ చూసుకుంటుందన్నారు. నాడు దొరికిన దొంగనే నేడు ముఖ్యమంత్రి అయ్యారని ధ్వజమెత్తారు.










