KTR Fires On Cm Revanth Reddy | SLBC టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం దిగజారుడు రాజకీయమేనని విమర్శలు గుప్పించారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
రోమ్ ( Rome ) నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు, ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యూయేట్స్ కు గాలం వేసేందుకు సిద్ధమైన సీఎంను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాత పెడ్తారని మండిపడ్డారు.
రాష్ట్ర ముఖ్యమంత్రికే జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్ నెస్ ( Seriousness ) లేకపోతే, ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటది ? రెస్క్యూ ఆపరేషన్ ( Rescue Operation ) ఎలా ముందుకు సాగుతది ? అని నిలదీశారు.
ఓట్ల వేటలో జిల్లాలకు జిల్లాలు చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది కానీ.. ఒక్కసారి క్షతగాత్రుల ఆర్థనాదాలతో మిన్నంటుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ కు వెళ్లే టైమ్ లేదా ? అంటూ ప్రశ్నించారు.
ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా ? ప్రజాపాలన అంటే నోట్ల వేట.. ఓట్ల వేట మాత్రమేనా ? అంటూ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.










