Komatireddy Rajgopal Reddy News | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ..పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. పాలమూరు బిడ్డ సీఎంగా ఉండడం ఖాయం అని పేర్కొన్నారు. అలాగే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందేనని డిమాండ్ చేశారు.
కాగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ‘రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు.’ అని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.










