Kishan Reddy Letter to Bhatti Vikramarka | ప్రజాభవన్ లో శనివారం ఆల్ పార్టీ ( All Party ) ఎంపీల సమావేశం జరిగిన విషయం తెల్సిందే. కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండాగా ఈ భేటీ జరిగింది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో సమావేశం ప్రారంభం అయ్యింది. రాష్ట్రంలోని ఎంపీ లందరికీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆహ్వానం పలికారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే ఈ భేటీకి బీజేపీ ఎంపీలు దూరంగా ఉంటున్నట్ల కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎంకు లేఖను రాశారు.
భేటీకి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలకు శుక్రవారం ఆలస్యంగా సమాచారం అందిందని పేర్కొన్నారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో భేటీకి హాజరు కాలేకపోతున్నట్లు వివరించారు. భవిష్యత్ లో ఇలాంటి భేటీలు ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు.