Kalvakuntla Kavitha News | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ లోకి వస్తా అంటే మహేష్ కుమార్ వద్దు అన్నట్లు మీడియాలో కథనాలు వచ్చిన విషయాన్ని కవిత గుర్తుచేశారు. వచ్చేది జాగృతి ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేసిన ఆమె టీపీసీసీ చీఫ్ ను తన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు కవిత ఆదివారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు.
జాగృతి పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చెప్పిన కవిత మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో చేరితే ఆయన రాజకీయ అనుభవానికి తగ్గట్లు మంచి పదవి ఇస్తామని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ లోకి వస్తా అనడం, ఆయన వద్దు అనడంలో వాస్తవం లేదన్నారు. బహుశా మహేష్ కుమార్ గౌడ్ కు కలలో ఇలా కనిపించి ఉండవచ్చని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో తన వ్యక్తిత్వాన్ని కించపరచొద్దన్నారు. జాగృతి పార్టీ తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.










