IPL Dot Ball Tree Plantation | ఐపీఎల్-2025 అభిమానుల్ని అలరిస్తుంది. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో బౌలర్ డాట్ బాల్ వేసిన ప్రతీ సారి స్కోర్ కార్డులో చెట్టు సింబల్ దర్శనమిస్తుంది. ప్రతి డాట్ బాల్ కు బీసీసీఐ మొక్కలు నాటుతుందన్న విషయం తెల్సిందే.
కానీ ఎక్కడ, ఎప్పుడు నాటారు అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. 2023లో బీసీసీఐ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ అయిన టాటా గ్రూప్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ప్లేఆప్స్ లో వేసే ప్రతి డాట్ బాల్ కు 500 మొక్కలు నాటేందుకు హరిత కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ క్రమంలో 2023 ప్లేఆప్స్ లో మొత్తం 294 డాట్ బాల్స్ నమోదయ్యాయి. అంటే మొత్తం 1,47,000 మొక్కలు. అలాగే 2024 ప్లేఆప్స్ లో 323 డాట్ బాల్స్ నమోదు కాగా నాటాల్సిన మొక్కలు 1,61,500. 2023, 2024 ఐపీఎల్ సీజన్లలో కేవలం ప్లేఆప్స్ కే పరిమితం అయ్యిన ఈ కార్యక్రమం 2025 ఐపీఎల్ లో మాత్రం సీజన్ మొత్తం అమలవుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది.
కానీ డాట్ బాల్ కు 18 మొక్కలు నాటనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2023,24 ప్లేఆప్స్ లో నమోదైన డాట్ బాల్స్ మూలంగా నాటాల్సిన మొక్కలు ఎక్కడ అనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటక, గుజరాత్, అస్సాం, కేరళ వంటి రాష్ట్రాల్లో మొక్కలు నాటినట్లు కథనాలు వెలువడినా బీసీసీఐ నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
18 డిసెంబర్ 2024లో ఐపీఎల్ సోషల్ మీడియా నుండి మొక్కలకు సంబంధించి ఒక పోస్టు వచ్చింది. బెంగళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడెమీలో బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ మరియు టాటా సన్స్ ప్రతినిధి కలిసి మొక్క సంఖ్య 4,00,000ని నాటినట్లు పోస్ట్ చేశారు.
డాట్ బాల్స్ కు 500 మొక్కల హరిత కార్యక్రమంకు సంబంధించి ఈ ఒక్కటే అధికారికంగా వెల్లడైంది. మిగిలిన లక్షలాది మొక్కలకు సంబంధించి ఎటువంటి సమాచారం లభించడం లేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ, టాటా గ్రూప్ ఆలోచన బాగున్నా మొక్కలను ఎక్కడ నాటారు అంటూ పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.