India vs Zimbabwe | టీ-20 వరల్డ్ కప్ సూపర్-8 లో భాగంగా గురువారం టీం ఇండియా కీలక మ్యాచ్ ఆడనుంది. గురువారం సాయంత్రం చెన్నై వేదికగా టీం ఇండియా-జింబాబ్వే మధ్య మ్యాచ్ జరగనుంది. పసికూనగా టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన జింబాబ్వే ఆ తర్వాత ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి గట్టి జట్లకు షాకిచ్చి సూపర్-8కు చేరుకుంది. సూపర్-8 లో భాగంగా ఆడిన తొలి మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో భారీ తేడాతో టీం ఇండియా ఓటమిపాలైంది. దింతో జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ లో కేవలం గెలిస్తేనే సరిపోదు, భారీ తేడాతో విక్టరీ సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్ జట్లు మెరుగైన నెట్ రన్ రేట్ తో టాప్ 2లో ఉన్నాయి. భారత్ టాప్-2లోకి వెళ్లాలంటే జింబాబ్వేను భారీ తేడాతో ఓడించాల్సిందే.
అయితే టీం ఇండియాకు గట్టి పోటీ ఇచ్చేందుకు జింబాబ్వే సైతం సిద్ధంగా ఉంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత బ్యాటర్లు పేలవ ప్రదర్శన కనబరిచారు. ఆచితూచి ఆడాల్సిన సమయంలో దూకుడు ప్రదర్శించి పెవిలియన్ బాట పట్టారు. ఈ తరుణంలో టీంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో జింబాబ్వేతో మ్యాచ్ లో టీం ఇండియాలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ తుది జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.










