Hydra | హైదరాబాద్ లో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటు చేసిన హైడ్రా (Hydra) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ప్రజలనూ భాగస్వాములు చేయాలని భావిస్తోంది.
ఈ క్రమంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతీ సోమవారం హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాట్లు చేయనున్నట్లు హైడ్రా చీఫ్ రంగనాథ్ తెలిపారు.
2025 జనవరి నుంచి ప్రతీ సోమవారం బుద్ధభవన్ లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వివరించారు. నగరంలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలకు సంబంధించి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
గడిచిన 40 ఏళ్లలో హైదరాబాద్ లోని 45 శాతం చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని రంగనాథ్ చెప్పారు. బయోడైవర్సిటీ లేక్ గా గుర్తింపు పొందిన అమీన్ పూర్ చెరువు కూడా కబ్జాలకు గురైందని రంగనాథ్ తెలిపారు.
చెరువుల ఆక్రమణలను గుర్తించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు చెరువులను ఆక్రమించి నిర్మించిన 200 కట్టడాలను హైడ్రా నేలమట్టం చేసినట్లు వెల్లడించారు.