Donald Trump News | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి కశ్మీర్ పై సోషల్ మీడియా వేదికగా పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది.
యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో భారత్-పాకిస్థాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని, ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ట్రంప్ శనివారం ప్రకటించారు. ఇరుదేశాలు కామన్ సెన్స్ ను ఉపయోగించి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నందుకు అభినందించారు.
అయితే, భారత ప్రభుత్వం ఈ ఒప్పందం అమెరికా మధ్యవర్తిత్వం ద్వారా కాకుండా, రెండు దేశాల మధ్య నేరుగా చర్చల ద్వారా కుదిరిందని స్పష్టం చేసింది. తాజగా కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కశ్మీర్ సమస్యను “వెయ్యి సంవత్సరాల” నుండి కొనసాగుతున్న సమస్యగా పేర్కొనడం గమనార్హం.
కశ్మీర్ శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తానని, రెండు దేశాలతో వాణిజ్యాన్ని పెంచుతానని చెప్పారు. ప్రస్తుత సంఘర్షణతో మరణాలు, విధ్వంసం తప్పా ఏమీ రాదని ఇరుదేశాల శక్తివంతమైన నాయకత్వం అర్ధం చేసుకున్నందుకు గర్వంగా ఉందన్నారు.
కాల్పుల విరమణపై అమెరికా మధ్యవర్తిత్వంతో చారిత్రక ఒప్పందాన్ని చేసుకున్నందుకు ట్రంప్ అభినందించారు. ఈ నేపథ్యంలో ఎటువంటి చర్చలు లేకుండానే ఇరుదేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తానని ట్రంప్ పేర్కొన్నారు.
అలాగే వేల సంవత్సరాల తర్వాత కశ్మీర్ విషయంలో ఒక పరిష్కారం కోసం భారత్-పాక్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు.